కోవిడ్ మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపిస్తోంది. ముఖ్యంగా ఆసియాలో కేసులు భారీగా పెరుగుతున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం, గడచిన వారం రోజుల్లో ఏకంగా 14,200 కొత్త కేసులు నమోదయ్యాయి.
వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నదానికి ప్రధాన కారణం ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ నేపథ్యంలో కొన్ని మరణాలు కూడా చోటుచేసుకున్నట్లు సమాచారం.
సింగపూర్, హాంకాంగ్ వంటి అభివృద్ధి చెందిన నగరాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్యలో 30 శాతం పెరుగుదల ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా హాంకాంగ్లో కోవిడ్ పాజిటివ్ కేసుల శాతం గణనీయంగా పెరిగిందని, మే 3 తర్వాత ఒక్క వారం రోజులలోనే భారీగా కేసులు నమోదయ్యాయని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ అధిపతి ఆల్బర్ట్ ఆయు తెలిపారు.
ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో తీవ్రత పెద్దగా లేదని, ఇప్పటివరకు కొత్త వేరియంట్లు గమనించబడలేదని, ఇది కొంత ఊరట కలిగించే విషయం. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, టీకాలు తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చైనాలో కూడా కోవిడ్ కేసుల పట్ల అధికార యంత్రాంగం బహుళ జాగ్రత్తలు తీసుకుంటోంది. మే 4 తర్వాత పాజిటివిటీ రేటు రెట్టింపు అయినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. ఇప్పటికి కోవిడ్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని భావించడం ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు.