ప్రపంచ సుందరీమణుల పోటీలు హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొంటున్న సుమారు 150 దేశాల కాంటెస్టెంట్లు వరుసగా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. బుధవారం వరంగల్ జిల్లాలో సందర్శన చేసిన అందగత్తెలు నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ సందర్శనల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేపట్టింది. మిస్ వరల్డ్ పోటీదారులు ఈరోజు రెండు ముఖ్య ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మొదట టూరిజం విలేజ్గా గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లిని సందర్శించనున్నారు. ఈ బృందంలో ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల సుందరీమణులు ఉండగా, సాయంత్రం 6 గంటల తర్వాత అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పోచంపల్లి ప్రత్యేకత అయిన ఇక్కత్ పట్టుచీరల నేయడం పట్ల పోటీదారుల్లో ఆసక్తి కనిపించనుంది. నేతన్నలతో మాట్లాడి, చీరల తయారీ ప్రక్రియను స్వయంగా తెలుసుకోనున్నారు. అనంతరం మ్యూజియాన్ని సందర్శించి, స్థానికులతో సంభాషిస్తారు. దీనితో పాటు, హ్యాండ్లూమ్, భూదాన్ పోచంపల్లి చరిత్రపై ప్రత్యేక వీడియోను వీరికి చూపించనున్నారు.
ఇక మరో బృందం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించనుంది. ఈ బృందంలో 10 మంది సభ్యులు ఉండగా, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు బ్రేక్ దర్శనం, జోడు సేవలను రద్దు చేసి పోటీదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సుందరీమణులకు తెలంగాణ సంప్రదాయ కోలాటం, బంజారా నృత్యాలతో ఘన స్వాగతం పలికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ చారిత్రక విశిష్టతపై వీడియో ప్రదర్శన కూడా ఉంటుంది. ప్రత్యేక అధికారి కిషన్రావు నేతృత్వంలో గ్రూప్ ఫొటో సెషన్తో ఈ పర్యటన ముగియనుంది.
ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్లతో తెలంగాణ సాంస్కృతిక వైభవం ప్రపంచానికి పరిచయం అవుతోంది. ప్రభుత్వం ఈ అవకాశాన్ని ప్రపంచ పర్యాటక మార్కెట్లో రాష్ట్ర ప్రతిష్ఠను పెంచేందుకు వినియోగించుకుంటోంది.