Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలకు సర్వం సిద్ధం.. కాళేశ్వరంలో మాత్రమే ఎందుకు జరుగుతాయంటే?

సరస్వతీ నది పుష్కరాలకు సమయం సమీపించింది. తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం ప్రస్తుతం పుష్కరాల కోసం రంగరంగలుగా ముస్తాబవుతోంది. బుధవారం రాత్రి 10:35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో పుష్కరాల కాలం మొదలవుతుంది. గురువారం (మే 15) సూర్యోదయం నుండి మే 26వ తేదీ వరకు మొత్తం 12 రోజులు పుష్కరాలు కొనసాగనున్నాయి. ఉత్తరాదిలో ప్రయాగ్ వద్ద, దక్షిణ భారతదేశంలో కేవలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది.

తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి సరస్వతీ పుష్కరాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాళేశ్వరంలో జరగనున్న ఇవే తొలి సరస్వతీ పుష్కరాలు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పుష్కర స్నానం ఆచరించనున్నారు. సీఎం రాక కోసం ప్రత్యేక హెలీప్యాడ్ ఏర్పాటైంది. కన్‌వాయ్ సరస్వతీ ఘాట్‌కు చేరే దారుల్లో బారికేడ్లు నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పుష్కరాలను రాష్ట్ర పండుగలా జరిపేందుకు సిద్ధమవుతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రూ. 35 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మొబైల్ యాప్, వెబ్‌సైట్ తయారు చేసింది. రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో 2013లో ఈ పుష్కరాలు జరగగా, అప్పటి నుంచి ఇది రెండోసారి.

కేవలం కాళేశ్వరంలోనే ఎందుకు పుష్కరాలు?
దక్షిణ భారతదేశంలో సరస్వతీ నది పుష్కరాలు జరగేది కేవలం కాళేశ్వరంలోనే. ఈ క్షేత్ర విశిష్టత ఏంటంటే, ఇక్కడ ఒకే పీఠంపై రెండు లింగరూపాలుగా శ్రీ కాళేశ్వర స్వామి (యముడు), శ్రీ ముక్తీశ్వర స్వామి (శివుడు)లు వెలిశారు. ముక్తీశ్వర లింగానికి రెండు నాసిక రంధ్రాలుండగా, అవి ద్వారా అభిషేక జలాలు భూమిలోపలకి వెళ్లి సరస్వతీ నదిగా ప్రవహిస్తాయి. ఆ నీరు గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా విలసిల్లుతుంది. ఇక్కడి నది అంతర్వాహినిగా ప్రవహించడంతో ప్రతి 12 ఏళ్లకోసారి సరస్వతీ పుష్కరాలు జరుగుతాయి. పుష్కర స్నానం అనంతరం శ్రీ మహా సరస్వతీ దేవిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇందుకోసం ప్రభుత్వం ఏకశిలతో తయారైన 17 అడుగుల సరస్వతీ మాత విగ్రహాన్ని ప్రతిష్టాపించనుంది. దీనిని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.

ఇంకెక్కడెక్కడ జరుగుతాయి సరస్వతీ పుష్కరాలు?
సరస్వతీ నది ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ సమీపంలోని ‘మన’ గ్రామంలో జన్మించింది. పురాణాల ప్రకారం అక్కడినుంచి భూగర్భంలోకి వెళ్లి వివిధ ప్రాంతాల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్మకం. ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్, గుజరాత్‌లో సోమనాథం, రాజస్థాన్‌లో పుష్కర్‌లలో త్రివేణీ సంగమాల్లో కూడా ఈ నది కనిపిస్తుందని విశ్వాసం ఉంది. అందువల్ల ఈ ప్రాంతాల్లో కూడా సరస్వతీ పుష్కరాలు నిర్వహించబడతాయి.

Leave a Reply