రాజకీయాల్లోకి రోహిత్ శర్మ.. మహారాష్ట్ర సీఎంతో కీలక భేటీ!

ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టనున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లు తాజా ఘటన ఒకటి జరిగింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను రోహిత్ శర్మ కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజులకే రోహిత్ సీఎం ఫడ్నవీస్‌ను ప్రత్యేకంగా కలవడం అనేక సందేహాలకు తావిస్తోంది. గంటకు పైగా సాగిన ఈ సమావేశం రాజకీయ ప్రస్థానం కోసం చర్చేనా అన్న ఊహాగానాలకు దారితీసింది.

సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్

గతవారం రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలికిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనలో, తన 67 టెస్ట్ మ్యాచ్‌ల కెరీర్‌లో 4,301 పరుగులు సాధించానని, ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయని వెల్లడించారు. అతని అత్యధిక స్కోర్ 212గా ఉంది.

ఈ నేపథ్యంలో, వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించిందన్న సమాచారం కూడా బయటకు వచ్చింది. దీంతో రోహిత్ శర్మ టెస్టుల నుంచి ముందే తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే T20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్, ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నారు.

Leave a Reply