PM Modi: పాక్‌కు తగిన బుద్ధి చెప్పిన భారత సైన్యం.. యావత్ దేశానికి మీరు గర్వకారణం: ప్రధాని మోదీ

పాక్ నుంచి ముప్పు పెరిగిన తరుణంలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించి, దేశ రక్షణకు అంకితమైన సైనికులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన మాటలు దేశం మొత్తం గర్వపడేలా చేశాయి.

“ఉగ్రవాదుల ఇంట్లోకి చొచ్చుకెళ్లి చిత్తు చేసిన సైనికుల ధైర్యానికి దేశం సెల్యూట్ చేస్తోంది. పాక్ అణుబాంబు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ.. భారత సైన్యం ధైర్యంగా ఎదురొడ్డి వినాశనం మిగిల్చింది. మన డ్రోన్లు, క్షిపణుల శక్తిని చూసి పాక్‌కు నిద్ర లేకుండా చేశాం. ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేయడంతో పాటు 100 మందికిపైగా ఉగ్రవాదులను ఖతం చేశారు,” అని మోదీ స్పష్టం చేశారు.

భారత సైనికుల కారణంగానే దేశ ప్రజలు సురక్షితంగా జీవిస్తున్నారని, వారి త్యాగం, ధైర్యం నేటి తరానికి కాదు.. రేపటి తరానికి కూడా స్ఫూర్తి అని పేర్కొన్నారు. “నేటి నుంచి పదేళ్ల తర్వాత దేశం పరాక్రమం గురించి చర్చించినప్పుడు, మీరెప్పుడూ ఒక ఉదాహరణగా నిలవాలి,” అని మోదీ కొనియాడారు.

ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశమంతా సైనికుల పక్కన నిలిచిందని, ప్రతి భారతీయుడు వారి విజయాన్ని ప్రార్థించినట్టు చెప్పారు. “భారతదేశం బుద్ధుడి భూమి, గురుగోవింద్ సింగ్ మహానుభావుని భూమి. ఈ నేల శాంతిని మాత్రమే కాదు, శత్రువుకు తగిన బుద్ధి చెప్పగల శక్తిని కూడా కలిగి ఉంది,” అని మోదీ వ్యాఖ్యానించారు.

ఈ యుద్ధ సమయానికి మీరు చరిత్ర సృష్టించారు, అందుకే మీ ముఖాముఖి దర్శనానికి వచ్చానని మోదీ అన్నారు. ముగింపుగా, త్రివిధ దళాలు, బీఎస్ఎఫ్, ఇతర రక్షణ దళాలకు ఆయన సెల్యూట్ చేశారు.

Leave a Reply