తెలంగాణ మహిళలకు శుభవార్త! ఇకపై ఆధార్ కార్డు లేకపోయినా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికల హామీ మేరకు ‘మహాలక్ష్మి పథకం’ ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందిస్తోంది. అయితే ఇప్పటివరకు ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డుగా ఆధార్ చూపించాల్సిన నిబంధన ఉండేది.
ఈ నేపథ్యంలో చాలా మంది నెటిజన్లు ఓ కీలక ప్రశ్న అడిగారు – “ఆధార్ కార్డు లేకపోతే ఫ్రీ బస్సు ప్రయాణం ఎలా?”. దీనికి తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో స్పందించారు. మహిళలకు గుడ్న్యూస్గా.. “ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జారీ అయిన ఎలాంటి గుర్తింపు కార్డైనా చూపించొచ్చు” అని ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్ లాంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఆధార్కు బదులుగా ఉపయోగించవచ్చని చెప్పారు. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ తీసుకోని మహిళలకు మేలైన అవకాశం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, తదితర గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించి జీరో టికెట్లను తీసుకోవచ్చు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత రవాణా సదుపాయం స్కీమ్ అమలుకు ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికం కాదు.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 8, 2025
ప్రస్తుతం బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే, కండక్టర్కు గుర్తింపు కార్డు చూపించిన తరువాత ‘జీరో టికెట్’ ఇస్తారు. ఈ జీరో టికెట్ ఆధారంగా వారి ప్రయాణం ఉచితంగా గుర్తించబడుతుంది. అయితే ఆధార్ కార్డు లేకున్నా పాన్, ఓటర్ ఐడీ వంటి ఇతర గుర్తింపు పత్రాలు చూపిస్తే కూడా అదే విధంగా జీరో టికెట్ జారీ అవుతుంది.
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తరువాత వీసీ సజ్జనార్ ఎన్నో పాజిటివ్ మార్పులు తీసుకువచ్చారు. ప్రత్యేకంగా మహిళల కోసం పలు ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకుంటూ, సేవలలో పారదర్శకత, సౌలభ్యం కల్పించడంపై దృష్టి పెట్టారు. ఆధార్ లేకున్నా ప్రయాణం అనుమతించడం అనేది అందుకు ఒక ప్రూఫ్ లాగా నిలుస్తోంది.
ఈ నిర్ణయంతో మరింత మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతి మహిళకు చేరవేసే దిశగా ఇది మరో ముందడుగు.