ఉగ్రవాదానికి బుద్ధి చెప్పే విధంగా భారత్ మరోసారి ఘాటు ప్రతీకారం తీర్చుకుంది. మే 7వ తేదీ బుధవారం రాత్రి 1.30 గంటలకు భారత వైమానిక దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై గట్టి ఎయిర్స్ట్రైక్స్ చేశాయి. ఈ దాడిలో లష్కరే తోయిబా, జైష్-ఎ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రసంస్థలకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఈ దాడికి భారత ప్రభుత్వం “ఆపరేషన్ సిందూర్” అనే పేరు పెట్టడం గమనార్హం. భరతమాత నుదుటిపై దాడికి ప్రతీకగా, ఈ దాడికి ఈ పేరును ఎంపిక చేసినట్టు చెబుతున్నారు.
భారత వైమానిక దళాలు పాకిస్తాన్లోని 4 ప్రదేశాలను, అలాగే పీఓకేలోని 5 కీలక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న ఈ శిబిరాలు ఉగ్రదళాలకు ప్రధాన అడ్డాలుగా ఉపయోగపడుతున్నాయి.
భారత్ టార్గెట్ చేసిన 9 ప్రాంతాలు ఇవే:
1. బహవల్పూర్:
జైష్-ఎ-మహ్మద్ ప్రధాన కార్యాలయం. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరం పూర్తిగా ధ్వంసం చేయబడింది.
2. మురిడ్కే:
లష్కరే తోయిబా ప్రధాన శిబిరం. ముంబై 26/11 దాడులకు సంబంధం ఉన్న ఈ స్థావరం సరిహద్దు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
3. గుల్పూర్:
పూంచ్-రాజౌరి ఎల్ఓసీ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్ర శిబిరం.
4. లష్కర్ క్యాంప్ – సవాయి:
తంగ్ధర్ సెక్టార్ (POK)లో 30 కిలోమీటర్ల లోపు ఉన్న ఉగ్ర శిబిరం.
5. బిలాల్ క్యాంప్:
జైష్ సంస్థకు చెందిన లాంచ్ప్యాడ్. ఉగ్రవాదులను భారత్లోకి చొరబాటుకు సిద్ధం చేయడానికి ఉపయోగపడేది.
6. కోట్లి క్యాంప్:
ఎల్ఓసీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. 50 మందికి పైగా ఉగ్రవాదులకు వసతి కల్పించే సామర్థ్యం ఉన్న రహస్య స్థావరం.
7. బర్నాలా క్యాంప్:
ఎల్ఓసీ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో కీలక శిబిరం.
8. సర్జల్ క్యాంప్:
జైష్ శిక్షణా శిబిరం. సాంబా-కతువా ఎదురుగా, అంతర్జాతీయ సరిహద్దుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
9. మెహమూనా క్యాంప్ (సియాల్కోట్ సమీపంలో):
హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన శిక్షణా శిబిరం. ఇది సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.