సింహాచలం గోడకూలిన ఘటనపై ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం..!

విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో చోటుచేసుకున్న విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో చందనోత్సవ సమయంలో గోడ కూలిపోవడంతో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందిస్తూ త్రిసభ్య కమిటీని విచారణకు నియమించారు.

ఈ కమిటీలో మున్సిపల్ పరిపాలనశాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, పోలీస్ అధికారి ఐజీ రవికృష్ణ, జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. విచారణలో పలు అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చందనోత్సవానికి ముందు హడావుడిగా నిర్మించిన గోడకు పునాదులు లేకపోవడం, వర్షపు నీరు వెళ్లేందుకు కనీస లీప్ హోల్స్ లేకపోవడం వంటి నిర్మాణ తప్పిదాలు ప్రాథమికంగా గుర్తించారు. శ్రద్ధాహీనత కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని కమిటీ స్పష్టం చేసింది.

ఈ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. దేవాదాయ, పర్యాటక శాఖలకుచెందిన ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. వీరిలో సింహాచలం దేవస్థాన డిప్యూటీ ఈఈ మూర్తి, జేఈ బాబ్జీ, ఏపీటిడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్ మోహన్ తదితరులు ఉన్నారు. కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణను బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం, అతనిపై మరియు మరో ఇద్దరు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

ప్రతి ఏడాది నిర్వహించే చందనోత్సవం సందర్భంగా లక్షలాది భక్తులు సింహాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఏడాది దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పాట్లలో అలసత్వం కనబరచిన అధికారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం గమనార్హం.

Leave a Reply