తేదీ మారితే మారే నియమాల్ని చిన్నగా తీసుకోవడం మనకు చేటు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఈ మార్పులు నేరుగా మన ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 2025, మే 1 నుంచి కొన్ని కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్ సేవలు, గ్యాస్ ధరలు, రైల్వే టికెట్ బుకింగ్ విధానాలు ఇలా పలు రంగాల్లో కొత్త నిబంధనలు ప్రవేశిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏటీఎం లావాదేవీలపై కొత్త ఛార్జీలు
మే 1 నుంచి ఏటీఎం నుండి డబ్బులు విత్డ్రా చేయడం మరింత ఖరీదవుతుంది. ఇప్పటి వరకు ఉచిత లావాదేవీలకు పరిమితి ఉన్నా, ఇకపై ప్రతి విత్డ్రావల్పై రూ.19 వసూలు చేయనున్నారు. ఇదివరకు ఇది రూ.17 మాత్రమే. అంతేకాదు, బ్యాలెన్స్ చెక్ చేసినా రూ.7 ఛార్జ్ విధించనున్నారు, ఇది కూడా రూ.6 నుండి పెరిగింది. తరచూ ఏటీఎం వాడే వారికి ఇది పెద్ద భారమే.
రైల్వే టికెట్ బుకింగ్ విధానాల్లో మార్పులు
ఇంకా వెయిటింగ్ టికెట్తో స్లీపర్ కోచ్లో ప్రయాణం చేయాలనుకుంటే అది సాధ్యపడదు. మే 1 నుంచి వెయిటింగ్ టిక్కెట్లు కేవలం జనరల్ కోచ్లకే వర్తించనున్నాయి. ఇది ప్రయాణికులకు అసౌకర్యంగా మారే అవకాశముంది.
ఒక రాష్ట్రం – ఒక ఆర్ఆర్బీ విధానం
దేశంలోని 11 రాష్ట్రాల్లో ‘వన్ స్టేట్ వన్ RRB’ పథకం అమలు కానుంది. అంటే ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కలిపి ఒకే బ్యాంకుగా పనిచేస్తాయి. ఈ మార్పు ద్వారా బ్యాంకింగ్ సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని అధికారులు అంటున్నారు. ఈ విధానం ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో అమల్లోకి వస్తుంది.
ఎల్పిజి ధరల్లో సమీక్ష
ప్రతి నెల మొదటి తేదీ ఎలాగైతే గ్యాస్ ధరలు సమీక్షిస్తారో, ఈసారి కూడా మే 1న గ్యాస్ ధరల్లో మార్పులు రానున్నాయి. ఇది కూడా ప్రజలపై ప్రత్యక్ష భారం పెంచే అవకాశం ఉంది.
ఎఫ్డీ, పొదుపు ఖాతాల వడ్డీ రేట్లలో మార్పులు
రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో మే 1 నుండి చాలా బ్యాంకులు ఎఫ్డీ, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దీన్ని మనం ముందే గమనించి అవసరమైన ఆర్థిక ప్లానింగ్ చేసుకోవాలి.
ఈ మార్పులన్నీ సామాన్య ప్రజల ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. అందుకే ముందుగానే అవగాహన పెంచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి.