ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితి గురించి తాజా వివరాలు వెల్లడించారు. ఇటీవల సింగపూర్లోని ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళడంతో బ్రాంకోస్కోపీ ట్రీట్మెంట్ చేయించాల్సి వచ్చింది. కొన్ని రోజుల పాటు సింగపూర్లోనే చికిత్స అందించి, అనంతరం హైదరాబాద్కు తరలించారు.
తాజాగా మంగళగిరిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, “నా కుమారుడు ఇప్పటికీ ఆ ఘటన ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అర్ధరాత్రి పూట ఉలిక్కి లేచి, మేడ మీద నుంచి పడిపోతున్నట్టు పీడకలలు వస్తున్నాయి. ఈ ట్రామా నుంచి బయట పడేందుకు ప్రస్తుతం సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అందిస్తున్నాం” అని భావోద్వేగంగా తెలిపారు. అగ్ని ప్రమాదంలో మరో బాలుడు మృతి చెందాడని, ఇంకొకరికి చేతులు కాళ్లు బాగా కాలిపోయాయని కూడా తెలిపారు.
ఈ ఘటనపై పవన్ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, జనసేన కార్యకర్తలు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కూడా కుమారుడి కోసం తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ బాధ్యతల్ని నిర్వర్తించడమే కాకుండా తన సినిమాల షెడ్యూల్ను కూడా కొనసాగిస్తున్నారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG వంటి సినిమాలు ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లును ముందుగా విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.