జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. మత ప్రాతిపదికన 25 మంది అమాయకులను ఉగ్రవాదులు హత్య చేసినా, కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. భారత్లో నివసిస్తూ పాకిస్తాన్ను ప్రేమిస్తామని చెబుతుంటే, అలాంటి వారు అక్కడికే వెళ్లిపోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా, తమది జాతీయ విధానం అని తెలిపారు. దేశ భద్రతను కాపాడేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు.
మీరు పాకిస్తాన్ ని అంత ప్రేమిస్తే పాకిస్తాన్ వెళ్లిపోండి ఇక్కడ ఎందుకు @PawanKalyan @APDeputyCMO pic.twitter.com/IH4eaSXdFz
— Prasannakumar Nalle (@PrasannaNalle) April 29, 2025
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో పవన్ పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. ఈ ఘటన దేశాన్ని మొత్తం కుదిపేసిందని పేర్కొన్నారు. అందరూ ఉగ్రవాదంపై ఒకే తీరుగా స్పందించాలని, కశ్మీర్ భారతదేశానికి అఘటితమైన భాగమని గుర్తుచేశారు. ఓట్లు, సీట్లు కోసం ఇటువంటి విషయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని చెప్పారు. పహల్గామ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్రావు కుటుంబానికి జనసేన తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
సత్యం మాట్లాడాలంటే ధైర్యం కావాలంటూ పవన్ పేర్కొన్నారు. అమాయకులైన పర్యాటకులను కేవలం వారి మతం అడిగి హత్య చేయడం ఎంతటి అమానుష చర్యో వివరించారు. మధు భార్య చెప్పినట్లు, “కశ్మీర్ మన దేశం కాబట్టే వెళ్లాం” అన్న మాట తమకు బాధను కలిగించిందన్నారు. ఈ ఘటన భారతదేశంలోని ముస్లింలను టార్గెట్ చేయలేదని, కానీ హిందువులకు ఉన్న ఏకైక దేశం ఇది అని తెలిపారు. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఇంకెక్కడికి వెళ్లాలన్న ప్రశ్నను ఎదుర్కొనాల్సి వస్తుందని అన్నారు. మతవివాదాలు రేపే వారిపై జాగ్రత్తగా ఉండి ఎదుర్కొనాల్సిన అవసరం ఉందన్నారు.
జాతీయ అంశాలపై మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావ్ అని పలువురు విమర్శిస్తారని పవన్ చెప్పారు. దేశ సరిహద్దుల్లో భద్రత లేకపోతే, దాని ప్రభావం ఎక్కడికైనా వెళ్లొచ్చని పేర్కొన్నారు. అందుకే తాను దేశ భద్రతపై అంత చింతిస్తున్నానన్నారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉన్నంత కాలం ప్రశాంతంగా ఉండేది. కానీ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులపై ఎలాంటి కనికరం అవసరం లేదని, వారిని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశమంతా ఇప్పుడు ఏకమయ్యే సమయం వచ్చిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.