ముఖేష్ అంబానీ కుటుంబంలోకి మరో కీలక బాధ్యత వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన బోర్డులో అనంత్ అంబానీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. మే 1, 2025 నుంచి ప్రారంభమయ్యే ఐదేళ్ల పదవీకాలానికి ఈ నియామకం కొనసాగనుంది. దీనికి సంబంధించి హ్యుమన్ రిసోర్సెస్, నామినేషన్, వేతన కమిటీ సిఫార్సు మేరకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ సమాచారం స్టాక్ ఎక్స్ఛేంజ్కు కంపెనీ తెలియజేసింది.
ప్రస్తుతం అనంత్ అంబానీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనపై భవిష్యత్తు బాధ్యతలు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. రిలయన్స్ తన గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలపై దృష్టి సారిస్తోంది. 2035 నాటికి నికర-జీరో కార్బన్ కంపెనీగా మారాలన్న దిశగా క్లీన్ ఫ్యూయల్స్, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ, రీసైక్లింగ్, క్రూడ్-టు-కెమికల్స్ వంటి కీలక ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ రంగాల్లో అనుభవం ఉన్న అనంత్ నాయకత్వం మరింత కీలకమవుతుంది.
అనంత్ అంబానీ ఇప్పటికే జియో ప్లాట్ఫారమ్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ లాంటి అనుబంధ సంస్థల బోర్డుల్లో సభ్యుడిగా ఉన్నారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్లో కూడా సెప్టెంబర్ 2022 నుంచి బోర్డ్ మెంబర్గా ఉన్నారు.
అనంత్ బ్రౌన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అతను జంతుప్రేమికుడిగా ప్రసిద్ధి. జంతు సంక్షేమం, పునరావాసం, చివరి దశలో సంరక్షణపై ఆసక్తి చూపుతూ అనేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు.
రిలయన్స్ చరిత్రలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితుడైన మొదటి కుటుంబ సభ్యుడిగా అనంత్ అంబానీ నిలిచారు. ఇప్పటికే ఆకాష్ అంబానీ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్గా, ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.