హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు గుర్తింపు.. సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తాన్ పౌరులపై కేంద్రం కీలక చర్యలకు తెరతీసింది. ఇప్పటికే భారత్‌లో ఉన్న పాక్ పౌరులంతా దేశం విడిచి వెళ్లాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వ్యక్తిగతంగా ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.

అంతర్జాతీయ దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయిన నేపథ్యంలో, విదేశాంగ శాఖ పాక్ హైకమిషన్‌ను ఖాళీ చేయాలని ఇప్పటికే ఆదేశించింది. ఇక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం, హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 208 మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో చాలామంది టూరిస్ట్, బిజినెస్ వీసాలపై ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే వీరందరి వీసాలు రద్దు చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీంతో వీరిని వెంటనే పాక్‌కు పంపించేందుకు హైదరాబాద్‌లోని పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అన్ని వివరాలను సేకరించి, వారిని 48 గంటల్లోగా ఇండియా విడిచిపెట్టేలా చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి కూడా అమిత్ షా ఫోన్ చేసి ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడంతో పాటు, ముఖ్యమైన నగరాల్లో భద్రతను ముమ్మరం చేశారు. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో రక్షణ చర్యలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.

Leave a Reply