జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని దేశ భద్రతపై జరిగిన పెద్ద ప్రమాదంగా అభివర్ణించిన ఆమె, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
షర్మిల మాట్లాడుతూ, ఈ దాడి దేశంలోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది అనటానికి ఇది స్పష్టమైన ఉదాహరణ అని విమర్శించారు. “ఇంతమంది అమాయకులు ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం అనేది ప్రభుత్వ భద్రతా విఫలమని స్పష్టంగా చెబుతుంది. టూరిస్టులు పెద్ద సంఖ్యలో వచ్చే పహల్గాం వంటి ప్రాంతంలో భద్రతా మిషనరీ ఎందుకు నియమించలేదు?” అని ఆమె ప్రశ్నించారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి మనం దేశం మీద జరిగిన దాడి. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని ప్రధాని మోడీ గారు ఒక క్యాంపెయిన్ నడిపారు. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కాశ్మీర్ కి వెళ్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు? ఇది… pic.twitter.com/tpa7JQWFdp
— YS Sharmila (@realyssharmila) April 24, 2025
దేశ భద్రతను కాపాడాల్సిన కేంద్రం ఆ బాధ్యతను నిర్లక్ష్యం చేసిందని షర్మిల ఆరోపించారు. “ప్రధాని మోదీ దేశంలో శాంతి, భద్రత ఉన్నట్టు ప్రచారం చేశారు. కానీ వాస్తవం భిన్నంగా ఉంది. ఇదంతా బీజేపీ పరిపాలనలో భద్రతపై అశ్రద్ధకు నిదర్శనం. దేశ నిఘా వ్యవస్థ కూడా ఇప్పుడేమీ దేశానికి పని చేయడం లేదు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటోంది,” అని ఆమె విమర్శించారు.
ఈ ఘటనలో ఒక ముస్లిం బాధితుడు మృతి చెందడం గురించి మాట్లాడిన షర్మిల, “ఇది మతవిద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ కుట్రలకు తగిన జవాబు. దేశంలో మతం పేరుతో చిచ్చు పెట్టే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని” అని ఆమె అభిప్రాయపడ్డారు.
అంతేగాక, దేశంలోని మతసామరస్యాన్ని కేంద్రం కాపాడటంలో పూర్తిగా విఫలమైందని, అల్లర్లకు దారితీసే విధంగా దేశంలో భద్రతా పరిస్థితులు దిగజారిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “దేశానికి చౌకిదార్ అవసరం, కానీ ప్రజల కోసం పనిచేసే చౌకిదార్ కావాలి. బీజేపీ ప్రయోజనాల కోసం పని చేసే వారే ఇప్పుడున్నారని” షర్మిల విమర్శించారు.