MI VS CSK: రోహిత్ – సూర్య కుమార్ షో.. చెన్నైపై ముంబై ఇండియన్స్ ఘనవిజయం..!

ఇప్పటి వరకు తడబడుతూ వచ్చిన ముంబై ఇండియన్స్, ఎట్టకేలకు తన అసలైన ఆటతీరును బయటపెట్టింది. వాంఖడే స్టేడియంలో అభిమానుల మద్ధతుతో ఉత్సాహంగా ఆడిన ముంబై టీమ్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఘోరంగా ఓడించింది. ఈ విజయంతో ముంబై సీజన్‌లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. ప్రధానంగా కెప్టెన్ రోహిత్ శర్మ, ఫామ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు అసాధారణ ఇన్నింగ్స్‌లు ఆడి విజయంలో కీలక పాత్ర పోషించారు.

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్, ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. తొలి వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్, స్కై ఇద్దరూ చెన్నై బౌలర్లను చితక్కొట్టారు. వారు ఆడిన షాట్లు చూసి అభిమానులు ఫిదా అయ్యారు. స్కై 68 పరుగులతో ఆకట్టుకోగా, రోహిత్ 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ జంట 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిస్తూ మ్యాచ్‌ను త్వరగా ముగించింది.

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై, కొన్ని ఓవర్లలో వేగంగా వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్రను తొలి ఓవర్లోనే అవుట్ చేసిన ముంబై యువ బౌలర్ అశ్వనీ కుమార్ ఇన్నింగ్స్‌ను షాక్‌తో ప్రారంభించాడు. అయితే అరంగేట్రం చేసిన ఆయుష్ మాత్రే 32 పరుగులతో దూకుడుగా ఆడి మంచి ఇంప్రెషన్ ఇచ్చాడు. ఆ తర్వాత జడేజా (53*), శివమ్ దూబే (50) మిడిల్ ఆర్డర్‌ను నిలబెట్టారు. వీరిద్దరి భాగస్వామ్యంతో సీఎస్కే 176 పరుగుల మోస్తరు స్కోరు చేసింది.

బుమ్రా లీడ్ తీసుకొని బౌలింగ్‌లో అద్భుతంగా ప్రదర్శించాడు. అతడికి తోడుగా దీపక్ చాహర్, శాంట్నర్, అశ్వనీ ఒక్కో వికెట్ తీసి చెన్నై ఆటగాళ్లను కట్టడి చేశారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ కంట్రోల్ ఉన్న కారణంగా చెన్నై పెద్ద స్కోరు చేయలేకపోయింది.

ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్‌లో మరింత బలంగా మారింది. వరుసగా మూడు విజయాలతో జట్టు గెలుపు బాటలో ఉన్నట్లు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, స్కై లాంటి టాప్ ప్లేయర్స్ ఫామ్‌లోకి రావడంతో ముంబై ఇకపై మరింత ప్రమాదకరంగా మారనుంది.

Leave a Reply