బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా చేసిన ఓ వ్యాఖ్యపై ఉత్తరాఖండ్లో బాగా దుమారం రేగుతోంది. బద్రీనాథ్ సమీపంలో తన పేరుతో ఆలయం ఉందని, అందులో భక్తులు దర్శనానికి రావాలని సూచించిన ఆమె మాటలు, అర్చకుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఊర్వశీ వ్యాఖ్యలు అసత్యమని స్పష్టం చేసిన స్థానిక అర్చకులు, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
‘నా పేరుతో ఆలయం ఉంది’ – ఊర్వశీ వ్యాఖ్యలు వైరల్
ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఊర్వశీ రౌతేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. “బద్రీనాథ్కి వెళ్లే భక్తులు, పక్కనే ఉన్న నా ఆలయాన్ని కూడా దర్శించండి,” అని చెప్పిన ఆమె, ఢిల్లీ యూనివర్శిటీలో తన ఫొటోకు పూలమాలలు వేసి ‘దండమమాయి’గా పూజిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.
View this post on Instagram
‘ఆ ఆలయానికి ఊర్వశీకి ఎలాంటి సంబంధం లేదు’ – అర్చకుల స్పష్టీకరణ
బద్రీనాథ్ సమీపంలో బామ్నిలో ఉన్న ఊర్వశీ దేవి ఆలయం, పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు తొడ నుంచి జన్మించిన దేవత లేదా సతీదేవి శరీర భాగం పడిన స్థలంగా భావిస్తారని స్థానిక అర్చకుడు భువన్ చంద్ర ఉనియాల్ తెలిపారు. అది భక్తుల ఆస్తి, నటి ఊర్వశీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆమె చెప్పిన మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించేవి అని అన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్
ఈ వ్యాఖ్యలతో ధార్మిక ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఇకనైనా ప్రభుత్వానికి మేలుకొలుపు రావాలంటూ అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తప్పుదారి చూపే వ్యాఖ్యలు ఎవరైనా చేసినా నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.