సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. నటిగా తెలుగు, తమిళం, మలయాళ భాషలలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న అభినయ, తాజాగా వివాహబంధంలోకి అడుగు పెట్టినట్లు ప్రకటించారు. ఆమె తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్కు చెందిన వి. కార్తిక్ అలియాస్ సన్నీ వర్మతో అభినయ వివాహం ఘనంగా జూబ్లీహిల్స్లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకకు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులు నవ్వుతూ, ప్రేమగా కనిపిస్తున్న ఫోటోలు చూసిన అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
అభినయ మరియు సన్నీ వర్మ రిసెప్షన్ ఈ నెల 20న జరగనుంది. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, గతంలో మార్చి 9న వీరి నిశ్చితార్థం సాంప్రదాయ పద్ధతిలో జరిగింది.
తెలుగులో అభినయకు మంచి ఫాలోయింగ్ ఉంది. ‘నేనింతే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శంభో శివ శంభో’ వంటి హిట్ చిత్రాల్లో మెరిశారు. ముఖ్యంగా స్టార్ హీరోలకి చెల్లెలుగా, వదిన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇటీవల మలయాళంలో ఆమె నటించిన ‘పని’ అనే సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. పెళ్లి అనంతరం ఆమె కెరీర్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయన్న ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పెళ్లి ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.