తెలంగాణ 10వ తరగతి ఫలితాలపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి మార్కుల ప్రకారంగా ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించినా, వాటి మెమోల ముద్రణపై స్పష్టత లేకపోవడం వల్ల ఫలితాలు విడుదల ఆలస్యం అవుతోంది. ఇప్పటికే విద్యాశాఖ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని పూర్తిచేసినప్పటికీ, మెమలు ఎలా ఉండాలి? అందులో పాస్, ఫెయిల్ మాత్రమే పెట్టాలా? లేక ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణులు ఉండాలా? అనే అంశాలపై స్పష్టత రాకపోవడంతో ఫలితాల విడుదల వాయిదా పడుతోంది.
రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే గ్రేడింగ్ విధానాన్ని తొలగిస్తూ GO జారీ చేసింది. ఈ నేపథ్యంలో నూతన విధానం ప్రకారం మార్కులతో ఫలితాలు ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ, మెమోల రూపకల్పనపై విద్యాశాఖ అంతర్గతంగా ఇంకా చర్చలు జరుపుతోంది. ఈ అంశంపై తుది నిర్ణయం రావాల్సి ఉండటంతో ఫలితాలు ఏప్రిల్ చివరి వారం కల్లా విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ నిర్ణయం ఆలస్యమైతే ఫలితాల విడుదల మరింత వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటికే NCERT సమావేశంలో పాస్, ఫెయిల్ అనే విధంగా ఫలితాలు ఇవ్వాలని సూచనలు వచ్చాయి. అలాగే 35 మార్కుల కన్నా తక్కువైతే ఫెయిల్గా పరిగణించాలని SCERT ప్రతిపాదించినా, దీనిపై ప్రభుత్వ ప్రతిస్పందన రాలేదని తెలుస్తోంది. అదే సమయంలో, మార్కుల విధానం వల్ల ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులపై ఒత్తిడి పెడతాయని TRSMA తరఫున అభ్యంతరాలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తానికి, ఫలితాల విడుదల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తుంటే, ప్రభుత్వ స్థాయిలో మెమోలు ఎలా ఇవ్వాలి? అన్న చిన్న విషయంపై స్పష్టత లేకపోవడం వల్ల తర్జన భర్జన కొనసాగుతోంది. త్వరలోనే స్పష్టత రావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.