ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ శ్రీకారం.. మొదటి విడతగా లక్ష రూపాయల చెక్కులు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులోకి వచ్చింది. మొదటి విడతగా అర్హులైన లబ్దిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెక్కులను పంపిణీ చేశారు. శంషాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మొత్తం 12మంది లబ్ధిదారులకు చెక్కులు అందించి, పథకాన్ని అధికారికంగా ప్రారంభం చేశారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, వికారాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు కూడా మొదటి విడత చెక్కులు అందాయి. ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున తొలి విడత సాయం అందించడం రాష్ట్రంలో హౌసింగ్ పథకాలపై ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను సూచిస్తోంది.

ప్రభుత్వం ఈ పథకం కింద మొత్తం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయనుంది. నిర్మాణ దశలవారీగా ఈ సహాయం ఇలా ఉండనుంది:

బేస్‌మెంట్‌ పూర్తయ్యాక – రూ. 1,00,000

గోడల నిర్మాణం తర్వాత – రూ. 1,25,000

శ్లాబ్ తర్వాత – రూ. 1,75,000

ఇంటి నిర్మాణం పూర్తయ్యాక – రూ. 1,00,000

మొత్తంగా రూ. 5 లక్షల మేర అర్థిక సాయం లభించనుంది. లబ్దిదారులు మొబైల్ యాప్‌లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు అప్‌లోడ్ చేస్తే, ఆయా దశల ప్రకారం నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి.

ఇళ్ల పరిమాణం 400 నుంచి 600 స్క్వేర్‌ఫీట్‌ మద్య ఉండాలని ప్రభుత్వం సూచించింది. అలాగే ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారి నియమించి పథకం అమలును పర్యవేక్షించనుంది. ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతలో అత్యంత పేదవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి లబ్ధిదారులను ఎంపిక చేసింది.

ఈ పథకం ప్రారంభం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పేదవారిలో సొంతింటి కల సాకారమవుతుందన్న ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో ప్రకటించిన హామీలను నిలబెట్టుకుంటూ సీఎం రేవంత్ సర్కార్ హౌసింగ్ రంగంలో మరో కీలక అడుగు వేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply