తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే మళ్లీ తెలుగు తెరపై కనిపిస్తోంది . 2014లో బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ “లెజెండ్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాధికా, ఆ తర్వాత ‘లయన్’ చిత్రంలోనూ కనిపించారు. అయితే ఆ తర్వాత దాదాపు దశాబ్ద కాలంగా టాలీవుడ్కి దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు గ్రాండ్గా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.
తాజాగా ఫిలింనగర్ సమాచారం ప్రకారం, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్లో రాధికా హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తమిళ నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఎంపికయ్యాడు. అలాగే సీనియర్ నటి టబు కూడా ఈ ప్రాజెక్ట్లో కీలక పాత్ర పోషించనుండటం విశేషం.
టబు పాత్ర గ్లామర్కు భిన్నంగా, ప్రత్యేకమైన డెప్త్ ఉన్న క్యారెక్టర్గా ఉండనుందని సమాచారం. ఇక రాధికా పాత్ర మాత్రం విజయ్ సేతుపతికి జోడీగా రోమాంటిక్ కోణం కలిగిన పాత్ర కావడం విశేషం. పూరి ఇప్పటి వరకూ తెరకెక్కించిన సినిమాల్లోని కాంబినేషన్లతో పోలిస్తే ఇది పూర్తిగా కొత్తగా ఉండబోతోంది. ముఖ్యంగా కథ, క్యారెక్టరైజేషన్, టెక్నికల్ అంశాలు కొత్తగా ఉంటాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు ఊపందుకున్న ఈ సినిమా జూన్లో సెట్స్పైకి వెళ్లనుంది. పూరి గతంలో ‘ఇస్మార్ట్ శంకర్’, ‘పోకిరి’, ‘బిజినెస్ మేన్’ వంటి హిట్ చిత్రాలను అందించిన సంగతి తెలిసిందే. అయితే ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ ఫ్లాప్ తర్వాత పూరికి ఇది క్రూషియల్ ప్రాజెక్ట్గా మారింది. అందుకే ఈసారి స్క్రిప్ట్ ఎంపికలో, నటీనటుల సెలెక్షన్లో ఎటువంటి లోపం ఉండకూడదనే పట్టుదలతో ఉన్నారు.
ఇక రాధికా విషయానికి వస్తే, తెలుగులో మళ్లీ నటించకూడదనుకున్న ఆమెకు ఈ కథ విని వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె నటనకు ఉన్న నేషనల్ ఆడియన్స్ ఫ్యాక్టర్ వల్ల రాధికాను తీసుకోవడం ద్వారా సినిమాకు వ్యాపారపరంగా మేలు జరుగుతుందని టీం భావిస్తోంది.
విజయ్ సేతుపతి, టబు, రాధికా ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో ఈ కాంబినేషన్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాస్టింగ్ ప్రకటన నుంచే ఆసక్తిని పెంచిన పూరి, కంటెంట్ పరంగా తన మార్క్ చూపగలిగితే ఈ సినిమా మరోసారి ఆయన కెరీర్కి టర్నింగ్ పాయింట్ అవుతుంది.
ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన, టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. రాధికా ఫ్యాన్స్ మాత్రం ఈ రీ ఎంట్రీకి తెగ ఖుషీ అవుతున్నారు.