అయ్యప్ప భక్తులకు శుభవార్త! శబరిమల గర్భగుడిలో స్వయంగా పూజించబడిన బంగారు లాకెట్లను ట్రావెన్కోర్ దేవస్థానం పబ్లిక్కి అందుబాటులోకి తీసుకొచ్చింది. కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ అధికారికంగా లాకెట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యంత పవిత్రమైన ఈ లాకెట్లు భక్తులందరికీ అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రథమంగా ఈ బంగారు లాకెట్ను ఆన్లైన్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ భక్తుడు బుక్ చేయగా, మొదటి లాకెట్ను ఆయనికి స్వయంగా మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఆ తరువాత శబరిమల తంత్రిగా వ్యవహరిస్తున్న కందరారు రాజీవరు, టిడిబి అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, బోర్డు సభ్యుడు ఏ. అజికుమార్ తదితరులు ఇతర భక్తులకు పంపిణీ చేశారు.
లాకెట్ల ప్రత్యేకత:
ఈ లాకెట్లు 2 గ్రాములు, 4 గ్రాములు, 8 గ్రాముల బరువుల్లో అందుబాటులో ఉన్నాయి.
బంగారు ధర ఆధారంగా నిర్ణయించిన లాకెట్ల ధరలు ఇలా ఉన్నాయి:
2 గ్రాముల లాకెట్ – ₹19,300
4 గ్రాముల లాకెట్ – ₹38,600
8 గ్రాముల లాకెట్ – ₹77,200
ఈ లాకెట్ల తయారీ బాధ్యతను తమిళనాడులోని GRT Jewellers మరియు కేరళకు చెందిన Kalyan Jewellers పొందాయి. టెండర్ల ద్వారా ఈ కంపెనీలను ఎంపిక చేశారు. భక్తులు ఈ లాకెట్లను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ఓపెన్ అయిన రెండు రోజుల్లోనే 100 మంది భక్తులు ముందస్తుగా లాకెట్లను బుక్ చేసుకున్నారు.
మలయాళ క్యాలెండర్ ప్రకారం “విషు” అనే పవిత్ర పండుగను పురస్కరించుకుని మొదటి విడత పంపిణీ చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, పూజించబడిన లాకెట్లను ఇలా అందుబాటులోకి తేనుంది దేవస్థానం.
అయ్యప్ప స్వామిని మానసికంగా దగ్గరగా ఉంచుకోవాలనుకునే భక్తులకు, ఇది ఒక ఆధ్యాత్మిక గుర్తుగా నిలుస్తోంది. ఇలా స్వామి దర్శనానికి వెళ్లలేని వారు ఇంట్లోనూ ఈ లాకెట్ ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు.