స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిష్ వలస పాలకులను ఎలా దేశం నుంచి తరిమికొట్టారో, ఇప్పుడు భారత ప్రజలు బీజేపీ పార్టీని కూడా అదే విధంగా ఓడించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం వద్ద బుధవారం నిర్వహించిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) మీటింగ్లో పాల్గొన్న ఆయన, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.
దేశంలోని ప్రజల మధ్య మతాల పేరుతో చిచ్చుపెట్టి, సమాజాన్ని విడదీయాలనే కుట్రతోనే మోదీ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. గాంధీజీ కలల భారతాన్ని నిర్మించాల్సిన తరుణంలో, బీజేపీ మాత్రం గాడ్సే సిద్ధాంతాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇది దేశ ప్రగతికి తీవ్ర అడ్డంకిగా మారుతోందని రేవంత్ స్పష్టం చేశారు.
LIVE: CM Revanth Reddy’s Speech at AICC Session | Ahmedabad | NyayPath https://t.co/JdoT6w4tou
— Revanth Reddy (@revanth_anumula) April 9, 2025
దేశవ్యాప్తంగా కులగణన అవసరమని, తెలంగాణలో ఎలా కులగణన చేపట్టామో అదే విధంగా కేంద్రం దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీకి అడుగుపెట్టే అవకాశం ఇవ్వమని ప్రజలను కోరారు. దేశమంతా గాంధేయవాదులు ఒకటై బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనాయకులు కూడా పాల్గొన్నారు. బీజేపీ విధానాలపై విమర్శల దాడికి కాంగ్రెస్ నాయకత్వం ఈ మీటింగ్ను వేదికగా ఉపయోగించింది.
ఇలాంటి వేదికలతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇదే సరికొత్త శుభారంభమని పార్టీలో ఆత్మవిశ్వాసం వ్యక్తమవుతోంది.