Priyansh Arya: IPLలో సంచలనం రేపిన ప్రియాంశ్ ఆర్య.. కూరగాయల ట్రాలీ నుంచి ఐపీఎల్ వరకు..!

ఒక మ్యాచ్ చాలు.. ఆటగాడి జీవితం మారిపోవచ్చు. అది మరీ ఐపీఎల్‌ వేదిక అయితే? అదంతా సినిమా లాగే ఉంటుంది. ఇప్పుడు అలాంటి స్టోరీనే రాసుకుంటున్నాడు యువ క్రికెటర్ ప్రియాంశ్ ఆర్య. దేశవాళీ క్రికెట్‌లో పూర్తి స్థాయి స్థానం దక్కకముందే ఐపీఎల్‌లో ఓ అద్భుత శతకంతో క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు ఈ ఢిల్లీ కుర్రాడు.

ముల్లాన్‌పూర్‌లో మిరాకిల్

నిన్న పంజాబ్ కింగ్స్‌ తమ సొంత మైదానంలో చెన్నైతో తలపడింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే చెన్నై బౌలర్లు భయానకంగా చెలరేగారు. ఎనిమిది ఓవర్లకే ఐదు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను ఘోర ఓటమి దిశగా నడిపించారు. కానీ అప్పుడే క్రీజులో నిలబడ్డాడు ఓ యువ ఆటగాడు – ప్రియాంశ్ ఆర్య.

అంతా విఫలమవుతున్నా.. ఒక్కడే నిలబడ్డాడు. ఆత్మవిశ్వాసంతో చెన్నై బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. 42 బంతుల్లో 103 పరుగులు – అందులో 7 ఫోర్లు, 9 సిక్సులు. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయమేమిటంటే, పతిరాన‌ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సులు కొట్టి ప్రేక్షకులను ఆహ్లాదంలో ముంచెత్తాడు. మ్యాచ్‌ని మలుపు తిప్పిన ఓ అద్భుత ప్రదర్శన.

ఢిల్లీ గల్లీల నుంచి ఐపీఎల్ వేదిక దాకా

ప్రియాంశ్ ఆర్య కథలో అసలు హైలైట్ ఏమిటంటే, అతడి బ్యాక్‌స్టోరీ. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ యువకుడు చిన్నప్పుడు తన తండ్రికి కూరగాయల ట్రాలీ తో తోడుగా వెళ్లేవాడు. అర్థరాత్రులు మార్కెట్లలో తండ్రికి సహాయం చేసి, ఉదయాన్నే మైదానానికి వెళ్ళేవాడు. కొంతకాలం “క్రికెట్‌ ఆడితే తిడతారేమో” అనే భయంతో ఇంట్లోనే విషయం చెప్పకుండా ప్రాక్టీస్ చేసేవాడు.

పక్కగా ఉన్న పార్క్‌లో స్ట్రీట్ క్రికెట్‌తో మొదలై.. అక్కడే కనిపించిన కోచ్ వల్ల ప్రియాంశ్ నిజమైన క్రికెట్‌ ట్రైనింగ్‌కు వెళ్లాడు. 2021-22లో దేశవాళీ అరంగేట్రం చేసినప్పటికీ, అవకాశాలు చాలా తక్కువే వచ్చాయి. కానీ అతడి టాలెంట్‌ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో వెలుగులోకి వచ్చింది – ఒక్క ఓవర్‌లో 6 సిక్సులు కొట్టడం, 50 బంతుల్లో 120 పరుగుల ఇన్నింగ్స్ అతడిని సెలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చాయి.

పంజాబ్ సెలక్షన్ – రూ.3.80 కోట్ల బిడ్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌పై సెంచరీ తర్వాత పంజాబ్ కింగ్స్ ఈ యువకుడిపై బిడ్ వేసింది. వేలంలో రూ.3.80 కోట్లకు తీసుకుంది. అప్పటినుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో 47 పరుగులు చేసి మెప్పించినా.. తర్వాత రెండు మ్యాచుల్లో 8, 0 స్కోర్లతో వెనుకబడ్డాడు. కానీ నిన్నటి మ్యాచ్‌తో ప్రూవ్ చేసుకున్నాడు.

ఇప్పుడు ప్రియాంశ్ ఆర్య – ఐపీఎల్‌లో నాల్గో వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎంటరయ్యాడు.

ఈ రోజు ఓ సెంచరీ.. రేపటి టీమిండియా స్టారేనా?

ప్రియాంశ్ ఆర్య కేవలం మరో యువ ఆటగాడే కాదు. తక్కువ అవకాశాలతోనూ, పట్టుదలతో ఎదిగిన ఓ నిఖార్సైన టాలెంట్ ఉన్న ప్లేయర్. బలమైన టెక్నిక్‌, స్ట్రైకింగ్ పవర్, కూల్ టెంపరమెంట్ – ఇవన్నీ కలిపి ఈ కుర్రాడు రేపటి భారత జట్టులో ఓ ఖచ్చితమైన స్థానం సంపాదించగలడని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

Leave a Reply