ఇప్పుడు టాలీవుడ్లో కొత్త ట్రెండ్ బలంగా కనిపిస్తోంది. హీరోయిన్లు కేవలం నటనకే పరిమితం కాకుండా, తమకు నచ్చిన కథలతో ప్రొడక్షన్ రంగంలోకి దిగుతున్నారు. ఇది కేవలం పేరు కోసం కాదు. కమిట్మెంట్తో, బిజినెస్ సెన్స్తో సినిమాలు నిర్మిస్తున్నారు. ఒకవైపు నటన, మరోవైపు నిర్మాణ బాధ్యతలు భుజాన వేసుకుని టేకింగ్ లో, కంటెంట్ లో ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా కొనసాగిస్తున్నారు.
ఇలాంటి ట్రెండ్లో ముందు అడుగులు వేసింది నిహారిక కొనిదెల. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో తొలి ప్రయత్నం చేసింది. ఆ ప్రాజెక్ట్కి మంచి స్పందన వచ్చిన తర్వాత, ఇప్పుడు అదే బ్యానర్లో రెండో సినిమా ప్రకటించింది. సంగీత్ శోభన్ హీరోగా, మానస శర్మ దర్శకత్వంలో సినిమా రూపొందనుంది. కథపై నమ్మకం, టీమ్పై విశ్వాసం ఉంటే నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం ఎలాంటి రిస్క్ అయినా ఆమె తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చూపిస్తోంది.
ఇంకొకవైపు సమంత కూడా ట్రాలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మాతగా మారారు. ‘శుభం’ అనే సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. సమంత నటనతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నదో, నిర్మాతగా కూడా అదే స్థాయిలో ట్రస్ట్ను బిల్డ్ చేసుకుంటుంది. మంచి కథలు వస్తే తప్పకుండా నిర్మిస్తానంటూ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. ఈ సినిమా విజయవంతం అయితే సమంత నిర్మాతగా సెట్ అయిపోయినట్టే.
నయనతార అయితే ఇప్పటికే కొంతకాలంగా నిర్మాణ రంగంలోనూ రూట్ వేసింది. రౌడీ పిక్చర్స్ బ్యానర్పై వరుస సినిమాలు నిర్మిస్తోంది. కొన్నింటిలో తానే నటించగా, మరికొన్నింటిలో తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్గా హిట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. నయనతార నిర్మాణంపై పెట్టే కేర్, స్టోరీ సెలెక్షన్ చూస్తే స్పష్టమవుతుంది.. వీళ్ళు కేవలం పేరు కోసం కాదు, ఫ్యూచర్ కోసం ప్లాన్ చేస్తున్నారు.
ఇటు టాలీవుడ్లో ఈ ట్రెండ్ నెమ్మదిగా పెరుగుతుంటే, బాలీవుడ్లో అయితే ఇదే ఫార్ములా చాలా కాలంగా నడుస్తోంది. అనుష్క శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్తో, ప్రియాంక చోప్రా పర్పల్ పెబుల్ పిక్చర్స్తో, కంగనా రనౌత్ తన మనికర్ణిక ఫిల్మ్స్తో నిర్మాణంలో బిజీగా ఉంటున్నారు. కంగనా అయితే డైరెక్షన్లోకి కూడా అడుగుపెట్టింది.
మొత్తానికి చెప్పాలంటే, హీరోయిన్లలో ఇప్పుడు ప్రొఫెషనల్ అవతారం తో బలంగా వెలిగిపోతున్నారు. నటనపై ఓకే మార్క్ సంపాదించుకున్న తారలు, ప్రొడక్షన్లోనూ అదే స్థాయి సీరియస్నెస్ చూపిస్తూ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెటవుతున్నారు. ఈ పంథాలో ఇంకెంతమంది చేరతారో చూడాలి!