ఈ రామనవమి భద్రాచలంలో కనుల విందుగా మారబోతున్నది ఒక చీర రూపంలో! సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ భద్రాచల సీతమ్మ కోసం స్వయంగా నేసిన బంగారు పట్టు చీరను కానుకగా అందించబోతున్నారు. ఇది కేవలం చీర కాదు, ఇది ఒక పవిత్ర శిల్పకళా సంపద. శరీరంపై వేయగానే మనసులో భక్తి ఊపిరిగా మారేలా ఆ చీరను తీర్చిదిద్దారు.
ఈ అరుదైన చీర ప్రత్యేకతలు చెవిలో పడితే, భక్తుల్లోనే కాదు.. ఆర్ట్ లవర్స్ లో కూడా విస్మయం కలుగుతుంది. చీర కొంగులో భద్రాచలం ఆలయ దేవతామూర్తులు, బార్డర్లో శంఖం, చక్రం, హనుమంతుడు, గరుత్మంతుడు, అంతేకాదు.. చీర మొత్తం మీద “శ్రీరామ రామేతి…” శ్లోకాన్ని 51 సార్లు నేసారు.
ఈ అద్భుత చీరని నెయ్యడం కోసం వన్ గ్రాము గోల్డ్ జరీ పట్టు దారాన్ని ఉపయోగించి, మొత్తం 800 గ్రాముల బరువు ఉన్న 7 గజాల బంగారు చీరను 10 రోజులపాటు శ్రమించి నేసారు హరిప్రసాద్.
ఇదే కాకుండా రాములవారి కల్యాణం కోసం స్వయంగా ఒక ప్రత్యేక పంచెను కూడా తానే నేసి సమర్పించబోతున్నారు. ఇంత శ్రద్ధ, భక్తి, కళను మేళవించి చేసిన ఈ పనితనం చూసినవారందరూ ఆయనను అభినందిస్తున్నారు.
“ప్రతి సంవత్సరం సీతారాముల కల్యాణానికి మా సిరిసిల్ల నేత కళను వినియోగించే అవకాశం ఇవ్వండి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన హరిప్రసాద్, తన నైపుణ్యం మాత్రమే కాదు.. తన ఆత్మను కూడా ఈ చీరలో నేసినట్టున్నారు.
ఇలాంటి కళాకారులను ప్రోత్సహించాల్సిన సమయం ఇది. భక్తి, చేనేత, స్వదేశీ కళ.. అన్నీ ఒక్క చీరలో ముడిపడ్డ అద్భుత ఘట్టం ఇది!