Nagababu: నాగబాబుకు చిరంజీవి, సురేఖ స్పెషల్ గిఫ్ట్.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..?

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబుకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖ నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు అందుకున్నారు.

ప్రమాణ స్వీకారం అనంతరం చిరంజీవి, సురేఖలు నాగబాబును పూలమాలతో సత్కరించి ఖరీదైన పెన్నును ప్రత్యేకంగా గిఫ్ట్ గా అందించారు. ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకు ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో అన్నయ్య, వదిన” అని రాశారు.

ఇందుకు స్పందించిన నాగబాబు, “అన్నయ్యా.. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞుడిని. మీరు కానుకగా ఇచ్చిన పెన్ను నాకెంతో ప్రత్యేకం. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ కలాన్నే వినియోగించడాన్ని ఎంతో గౌరవంగా భావించా” అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.

గతంలోనూ చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్ విజయోత్సవాల్లో భాగంగా తమ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన గిఫ్టులు అందించారు. ఇప్పుడు మళ్లీ నాగబాబుకు ఖరీదైన పెన్ను కానుకగా అందించడం విశేషం.

ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గెలుపు పిఠాపురం ప్రజల బలమైన మద్దతుతో సాధ్యమైంది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు చేయగా, జనసేన అభిమానులు నాగబాబుకు మద్దతుగా నిలిచారు.

మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇలా ముగ్గురు ప్రముఖులు రాజకీయాల్లో కీలక స్థాయికి చేరడం అభిమానులను ఎంతో ఆనందపరుస్తోంది.

Leave a Reply