పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ కేసును మరో కోణంలోకి తిప్పింది. చిల్లకల్ల టోల్ ప్లాజా వద్ద మార్చి 24న మధ్యాహ్నం 3:19 గంటలకు, ప్రవీణ్ బైక్ పై నుంచి కిందపడిన వీడియో వైరల్గా మారింది.
వైరల్ అవుతోన్న వీడియోలో, ప్రవీణ్ లారీ టైర్ల కింద పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఘటన సమయంలో వెనుక వస్తున్న బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో రైట్ తీసుకోవడంతో ఆయనకు పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న స్థానికులు ప్రవీణ్ను పైకి లేపి కూర్చోబెట్టారు. అయితే, కొన్ని క్షణాల తరువాత ఆయన మళ్లీ తన బైక్ తీసుకుని రాజమండ్రి వైపు ప్రయాణాన్ని కొనసాగించారు.
ఈ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 509 గజాల భూమి కొనుగోలు చేసినట్లు బయటపడింది. ఈ భూమిని ఆయన కుమార్తె రిషిక, మేనల్లుడు రాజేష్ పేరుపై రిజిస్టర్ చేశారు. మార్చి 12న ల్యాండ్ రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ భూమిని అనాధ పిల్లల కోసం హాస్టల్ నిర్మించేందుకు వినియోగించాలని ప్రవీణ్ భావించారన్న సమాచారం ఉంది.
మార్చి 24 ఉదయం 11 గంటలకు, ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయల్దేరారు. ఈ విషయం ఆయన భార్య, అలాగే ఆకాష్, జాన్ అనే వ్యక్తులకే తెలిసింది. మరి, ఆయన రాజమండ్రికి వెళ్ళడం, ల్యాండ్ కొనుగోలు చేయడం, ప్రమాదకర రీతిలో మరణించడం.. ఇవన్నీ ఆలోచనకు లోనయ్యే విషయాలే.
సీసీటీవీ ఫుటేజ్తో అతని మరణంపై కొత్త అనుమానాలు నెలకొన్నాయి. ప్రవీణ్ ప్రమాదంలో మరణించారా? లేక దీని వెనుక మరేదైనా కుట్ర దాగి ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.