బెట్టింగ్ యాప్ కేసు రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా స్పందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వెలుగుచూసిన అనేక బెట్టింగ్ యాప్ల కేసులను సీఐడీకి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల కేసుల దర్యాప్తు మరింత వేగంగా, సమర్థవంతంగా సాగుతుందని భావిస్తున్నారు.
గత కొన్ని వారాలుగా తెలంగాణలో బెట్టింగ్ యాప్ల ప్రభావం పెరుగుతోంది. ఈ యాప్లు ద్వారా అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు. కొందరు అయితే తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. రాష్ట్రంలో ఈ యాప్లను ప్రమోట్ చేస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, సినీ ప్రముఖులు, యూట్యూబ్ క్రియేటర్లపైనా నేరపూరిత ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసు శాఖ ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.
ఇటీవల హైదరాబాద్లోని పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులపై విచారణ ప్రారంభమైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. ఇక మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 మంది సినీ నటీనటులపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి తదితరులు ఉన్నారు. వీరంతా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా లేదా ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు.
ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్ల ప్రచారకర్తలపైనే పోలీసులు దృష్టి సారించగా, ఇప్పుడు ఈ యాప్ల నిర్వాహకులను కూడా నేరపూరిత చర్యలకు పాల్పడిన వారిగా గుర్తించి నిందితుల జాబితాలో చేర్చారు. మొత్తం 19 బెట్టింగ్ యాప్ల పేర్లను పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. అందులో ఏ23, జంగ్లీ రమ్మీ డాట్కామ్, ఫెయిర్ప్లే, జీత్విన్, మామ247, తాజ్77, ధని బుక్365, తెలుగు365, యెస్365, పరిమ్యాచ్, జెట్ఎక్స్, ఓకేవిన్ తదితర ప్రముఖ యాప్లు ఉన్నాయి. ఈ యాప్ల ద్వారా ప్రజలను ఆకర్షించి, వారి నుండి డబ్బును లూటీ చేస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
తెలంగాణ పోలీసులు ఇన్ఫ్లూయెన్సర్లు, సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చే ముందు న్యాయపరమైన సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణలో వారి ప్రమేయంపై తగిన ఆధారాలు లభిస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. ఇకపోతే, పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.
ఇప్పటికే బెట్టింగ్ యాప్లపై తెలంగాణ సర్కార్ చేపట్టిన చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి యాప్లపై దర్యాప్తు జరిపే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కేసు ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.