ఇటీవల బెట్టింగ్ యాప్స్ గురించి భారీ చర్చ జరుగుతోంది. ఈ యాప్స్ ప్రభావంతో అనేక మంది యువతీ, యువకులు మోసపోతున్నారు. కొందరు నేరాలకు పాల్పడుతుండగా, మరికొందరు అప్పుల భారం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ విస్తరణను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నా, ఈ మాఫియా రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో RTC ఎండీ సజ్జనార్ కూడా ఈ యాప్స్ వల్ల ఎంతటి దుష్ప్రభావాలు ఉన్నాయో వివరిస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే, ఈ పరిస్థితుల్లోనే ఒక యువకుడు తెగించి ఈ మాఫియాను బహిర్గతం చేయడానికి ముందుకొచ్చాడు. అతనే ‘నా అన్వేషణ’ ఫేమ్ అన్వేష్. ప్రపంచయాత్రికుడిగా గుర్తింపు పొందిన అన్వేష్, తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి భారీ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇప్పుడు, బెట్టింగ్ మాఫియా వెనుక దాగున్న నిజాలను ప్రజలకు వెల్లడించేందుకు అతను ముందుకొచ్చాడు.
అన్వేష్ తన తాజా వీడియోలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించిన వారి గుట్టు విప్పాడు. ముఖ్యంగా యూట్యూబర్ సన్నీ యాదవ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. అతను బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని, లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్లు కొనుగోలు చేశాడని అన్వేష్ తెలిపాడు. అంతేకాదు, పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్.. బెట్టింగ్ యాప్ల ద్వారా రూ. 25 కోట్లకు పైగా సంపాదించాడని, అతనికి నాలుగు కార్లు, ఆరు స్పోర్ట్స్ బైకులు, మూడు హోటళ్లు ఉన్నాయని వెల్లడించాడు. ఈ విషయాలు వైరల్ కావడంతో, పోలీసుల దృష్టి ఈ మాఫియాపై మరింతగా పెరిగింది.
ఈ క్రమంలో, పంజాగుట్ట పోలీసులు 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు. వీరిలో హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రిత లాంటి ప్రముఖ యూట్యూబర్లు ఉన్నారు. అంతేకాదు, సినీ తారలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, నయని పావని, నేహా పఠాన్ వంటి సెలబ్రిటీలపై కూడా విచారణ జరుగుతోంది.
ఈ మొత్తం వ్యవహారంలో అన్వేష్ చేసిన వీడియోలు బెట్టింగ్ మాఫియాను బహిర్గతం చేసే దిశగా కీలకంగా మారాయి. ఆయన చేసిన పరిశోధన, సేకరించిన వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బెట్టింగ్ మాఫియాపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.