Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం.. ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బుల వసూలుపై తీవ్ర మనస్థాపం..!

మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్‌లో మరో గొప్ప గౌరవాన్ని అందుకున్నారు. సినిమా రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా హౌస్ ఆఫ్ కామన్స్ – యూకే పార్లమెంట్ ప్రతిష్ఠాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఆయనకు ప్రదానం చేసింది. ఈ అరుదైన ఘనతకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే, చిరంజీవి లండన్‌లో ఈ అవార్డును అందుకుంటున్న సమయంలో, కొంతమంది ఆయన పేరు దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించారు. మెగాస్టార్‌ను కలుసుకునే అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని, ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఈ విషయం చిరంజీవి దృష్టికి రాగానే, ఆయన తీవ్రంగా స్పందించారు.

సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి, అభిమానుల ప్రేమను వాణిజ్యంగా మార్చడాన్ని తాను అస్సలు సహించబోనని స్పష్టం చేశారు.‘‘ప్రియమైన అభిమానులారా! లండన్‌లో నన్ను కలిసేందుకు మీరు చూపించిన ప్రేమ, అభిమానానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే, ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఇది పూర్తిగా తప్పుడు వ్యవహారం. అభిమానులపై నా ప్రేమను ఎవరైనా డబ్బుగా మార్చాలని చూస్తే, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను.

అలాగే, ఎవరైనా మీ వద్ద డబ్బులు వసూలు చేసి ఉంటే, వెంటనే తిరిగి తీసుకోండి. మన అభిమాన, అనుబంధం ప్రేమపూర్వకమైనది, స్వచ్ఛమైనది – దాన్ని ఎవ్వరూ స్వలాభార్జనకు ఉపయోగించకూడదు. నేను ఎక్కడా, ఎప్పుడూ ఫ్యాన్ మీట్‌ కోసం డబ్బులు వసూలు చేయడాన్ని అనుమతించను. అందరూ అప్రమత్తంగా ఉండండి” అని ఆయన సూచించారు.

మెగాస్టార్ వ్యాఖ్యలపై అభిమానుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు ఫ్యాన్స్ చిరంజీవి తీరును ప్రశంసిస్తుంటే, మరికొందరు ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఒకవైపు చిరంజీవికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో గౌరవం దక్కగా, మరోవైపు ఈ ఫ్యాన్ మీట్ ఘటన వివాదంగా మారింది.

Leave a Reply