IPL 2025: ఈసారి ఐపీఎల్‌లో పరుగుల పండగ! బ్యాటర్ల విజృంభణతో 300 ప్లస్ స్కోర్లు గ్యారంటీ..!

గతేడాది ఐపీఎల్‌లో బ్యాటర్లు అదరగొట్టారు. హైదరాబాద్ సన్‌రైజర్స్ తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారీ స్కోర్లు సాధించగా, ఇతర జట్లు కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటాయి. ఈ సారి మాత్రం ఇంకా భారీ స్కోర్లు నమోదవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది రికార్డులను మించే స్థాయిలో బ్యాటర్లు ఆడతారని.. 300 రన్స్ స్కోర్ ఈసారి సాధ్యమేనని చెబుతున్నారు.

ప్రతీ జట్టులోనూ స్ట్రాంగ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఉండటంతో పాటు, ఆల్‌రౌండర్ల సంఖ్య పెరగడం కూడా కీలకం. దీంతో ఇన్నింగ్స్ చివరి వరకు రన్స్ వేగంగా చేరే అవకాశం ఉంది.

గత ఏడాది ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ బెంగళూరుపై 287/3తో రికార్డు నెలకొల్పగా, ముంబయిపై 277/3, ఢిల్లీపై 266/7 స్కోర్లు నమోదు చేశారు. ఇంతకు ముందు బెంగళూరు జట్టు 263 పరుగులతో హయ్యెస్ట్ స్కోర్ చేసి 12 ఏళ్ల తర్వాత ఆ రికార్డు బ్రేకైంది. కానీ ఈ సారి అయితే 300 స్కోర్ కూడా దాటే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రత్యేకంగా హైదరాబాద్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్ పిచ్‌లతో పాటు, బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడడం రన్స్ వరదకు కారణంగా మారనుంది. భారత్‌లోని పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు, ఆటగాళ్లు వరుస టోర్నమెంట్లలో ఆడి రాణిస్తున్నారనే అంశం స్కోర్ల పెరుగుదలకు కారణమవుతుంది.

ఇప్పుడేం టార్గెట్ పెట్టినా బ్యాటర్లు ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు. 200 లేదా 250 రన్స్ లక్ష్యంగా పెట్టుకున్నా.. ఏ జట్టైనా సునాయాసంగా ఛేదించగలదనిపిస్తున్న పరిస్థితి. స్కోర్లు రెట్టింపు అవుతున్న ఈ ఐపీఎల్‌లో బెంగళూరు, హైదరాబాద్, ముంబయి మైదానాల్లో పరుగుల వరద అనివార్యంగా కనిపిస్తోంది.

క్రికెట్ అభిమానులకు ఈసారి ఐపీఎల్ అచ్చమైన పండగలా మారనుంది!

Leave a Reply