భారత క్రికెట్ జట్టు ప్రముఖ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, వారి విడాకులపై మరో కీలక అప్డేట్ వచ్చింది. రేపు (మార్చి 20) ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
చాహల్, ధనశ్రీ విడాకుల కోసం ఫిబ్రవరి 5న బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సాధారణంగా, వివాహ చట్టంలోని సెక్షన్ 13B ప్రకారం విడాకులకు 6 నెలల కూలింగ్ పీరియడ్ అవసరం. అయితే, ఈ వ్యవధిని బాంబే హైకోర్టు మినహాయించింది. ఫ్యామిలీ కోర్టు మార్చి 20లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. విడాకుల ఒప్పందం ప్రకారం, ధనశ్రీకి భరణంగా రూ. 4.75 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే చాహల్ రూ. 2.37 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
34 ఏళ్ల యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2025 సీజన్లో పాల్గొననున్నారు. ఈసారి అతను పంజాబ్ కింగ్స్ (PBKS) తరపున ఆడనున్నాడు. మార్చి 22న ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్లో పంజాబ్ జట్టు మార్చి 25న గుజరాత్ టైటాన్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది. బాలీవుడ్ నటి ప్రీతి జింటా యాజమాన్యంలోని పంజాబ్ జట్టు ఐపీఎల్ 2025 మెగా వేలంలో చాహల్ను రూ. 18 కోట్ల భారీ బిడ్డింగ్తో కొనుగోలు చేసింది.
చాహల్-ధనశ్రీ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో వారి మధ్య విబేధాలు ఉన్నాయని ఊహాగానాలు చెలరేగాయి. 2020 డిసెంబర్ 22న వివాహం చేసుకున్న ఈ జంట మధ్య గత కొంతకాలంగా సమస్యలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, ఇటీవల చాహల్ న్యాయవాది నితిన్ కె. గుప్తా కూడా వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ధృవీకరించారు.
రేపు (మార్చి 20) వీరి విడాకులపై అధికారిక ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో, క్రికెట్ అభిమానులు మరియు నెటిజన్లలో దీనిపై చర్చ జరుగుతోంది.