తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను 3,04,965 కోట్ల రూపాయలతో సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రకటించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్పీ) ప్రస్తుత ధరల ప్రకారం రూ.16,12,579 కోట్లకు చేరుకున్నదని, గత ఏడాది కంటే 10.1% వృద్ధి నమోదైందని ఆయన వెల్లడించారు.
ఈ బడ్జెట్లో మహిళలు, రైతుల కోసం ప్రత్యేక కేటాయింపులు చేయడం గమనార్హం. వ్యవసాయ శాఖకు రూ.24,439 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.23,373 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,674 కోట్లు కేటాయించారు. రైతు రుణమాఫీ కింద రూ.2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించి, 25.35 లక్షల మంది రైతులకు మొత్తం రూ.20,616.89 కోట్లు విడుదల చేశారు. అంతేకాకుండా, రైతు భరోసా పథకంలో ప్రతి ఎకరానికి రూ.12,000 అందించేందుకు రూ.18,000 కోట్లు కేటాయించారు.
రైతులతో పాటు భూమిలేని వ్యవసాయ కూలీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉపాధి లభించని రోజుల్లో ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.12,000 చెల్లించనున్నారు. ఇప్పటి వరకు రైతులకు రూ.1,206.44 కోట్ల బోనస్ కూడా ప్రభుత్వం అందజేసింది.
మహిళా సంక్షేమానికి కూడా భారీ కేటాయింపులు చేశారు. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకానికి రూ.3,683 కోట్లు కేటాయించగా, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.1,511 కోట్లు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.305 కోట్లు కేటాయించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసరాల్లో శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని భట్టి విక్రమార్క తెలిపారు.
అలాగే, మండల స్థాయిలో మహిళా రైస్ మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మహిళా స్వయం సహాయక సంఘాల రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేసి, ఆ తర్వాత FCIకి సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. మహిళా సమాఖ్యల ద్వారా RTCకి అద్దెకు 600 బస్సులు కేటాయించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన దేశంలో తొలి రాష్ట్రంగా నిలిచిందని భట్టి విక్రమార్క గర్వంతో ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆరు గ్యారంటీల అమలుకు రూ.56,000 కోట్లకు పైగా కేటాయింపులు చేశారు. 2050 వరకు తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దే మెగా మాస్టర్ప్లాన్ను రూపొందించామని, రాబోయే పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని భట్టి విక్రమార్క ప్రకటించారు.
ఈ విధంగా 2025-26 బడ్జెట్లో ప్రభుత్వం కీలక రంగాలకు పెద్దఎత్తున నిధులను కేటాయిస్తూ, రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రణాళికలు రచించింది.