కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులోసీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు, జగన్కు మధ్య కొందరు విభేదాలు సృష్టించారని విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కొందరు ఎదగడానికి తనను కిందకు అణిచివేశారని అన్నారు. ఇందులో పాత్రధారులు, సూత్రధారులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. అందువల్లే తను పార్టీకీ, ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.
కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో సీఐడీ విచారణకు హాజరయిన మాజీ ఎంపి విజయసాయిరెడ్డి, జగన్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ ఓ కోటరీ వుందని, ఆ కోటరీ నుంచి బయటపడితేనే జగన్కు భవిష్యత్తు ఉంటుందని విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. కోటరీకి అనుకూలంగా ఉంటేనే ఎవరినైనా వారు జగన్ దగ్గరకు తీసుకెళ్తారు.. లేదంటే దూరం పెడతారని ఆరోపణలు గుప్పించారు. చెప్పుడు మాటలను నాయకుడు నమ్మకూడదని జగన్ను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. చెప్పుడు మాటలు నమ్మితే అటు పార్టీ, ఇటు నాయకుడు నష్టపోతాడని అన్నారు.
కేవలం కోటరీ వల్లే జగన్కు తాను దూరమయ్యానని విజయసాయిరెడ్డి ఆవేదన చెందారు. జగన్ మనసులో స్థానం లేదు కాబట్టే పార్టీని వీడాల్సి వచ్చిందని, ఆయన స్పష్టం చేశారు. కోటరీ మాటలు వినొద్దని జగన్కు చెప్పినా కూడా తన మాటలు పట్టించుకోలేన్నారు విజయసాయి. విరిగిన మనసు అతుక్కోదు..వైసీపీలో మళ్లీ చేరను అని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. జగన్కు మంచి జరగాలని ఇప్పటికీ కోరుకుంటున్నానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి అని ఆయన ఆరోపించారు. దీని గురించి మరిన్ని వివరాలు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
కేవీ రావు ఫిర్యాదు మేరకు కాకినాడ పోర్టు వాటాల బదిలీపై సాయిరెడ్డితో పాటు మెుత్తం ఐదుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 విక్రాంత్ రెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి, ఏ3 శరత్ చంద్రారెడ్డి, ఏ4 శ్రీధర్, ఏ5గా అరబిందో రియాల్టీ ఇన్ఫ్రా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో విక్రాంత్ రెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇదే కేసులో ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి.. ఇవాళ సీఐడీ ముందు హాజరయ్యారు. ఈ నేపధ్యంలో ఇది రాజకీయ ప్రేరేపిత కేసుగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. కేవీ రావుతో ముఖపరిచయం తప్ప లావాదేవీలు లేవని చెప్పారు. YV సుబ్బారెడ్డి కొడుకుగా మాత్రమే విక్రాంత్ తెలుసన్నారు. కేసుగురించి KVరావుతో స్నేహితుడి ద్వారా మాట్లాడించా… ఓ అధికారి ఆదేశాలతో నా పేరు ఇరికించినట్టుగా కేవీరావు చెప్పారని తెలిపారు విజయసాయి. కేవీరావుకు విక్రాంత్రెడ్డిని పరిచయం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. చివరి వరకు విక్రాంత్ రెడ్డే చేశారని కేవీ చెప్పారు.. ఇదే విషయాన్ని సీఐడీకి చెప్పానట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.
కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో విచారణలో భాగంగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన సీఐడీ అధికారులు కొన్ని కీలక ప్రశ్నలు అడిగారని సమాచారం. కొన్నింటికి చాలా సూటిగా సమాధాలు చెప్పినట్టుగా తెలుస్తుంది.అయితే మరోసారి విచారణ జరిగే అవకాశం వుందా అనేదానిపై విజయసాయిరెడ్డి క్లారిటి ఇవ్వలేదు. అయితే విచారణ అనంతరం విజయసాయిరెడ్డిని ప్రెస్ మీట్ లో జగన్ కోటరి గురించి సంచలన వ్యాఖ్యలు చేయటం గమనార్హం.