శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మాదాపూర్ హెడ్ ఆఫీస్లో ఐటీ అధికారులు రూ.5 కోట్లు స్వాధీనం చేసుకొని హార్డ్డిస్క్లు, పలు బ్యాంక్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపులపై ఆరాతీస్తున్నారు. ఈ ఐటీ దాడులు ఏకకాలంలో దేశ వ్యాప్తంగా వున్న అన్ని శ్రీచైతన్య కాలేజీల ఆఫీసుల్లో జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలతోపాటు అనేక ప్రాంతాల్లో శ్రీచైతన్య విద్యా సంస్థ లపై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని శ్రీచైతన్య కార్పొరేట్ ఆఫీసులోనూ, ఏపీ, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పుణే సహా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థల్లో సోమవారం ఉదయం ఏకకాలంలో ఐటీ సోదాలు ప్రారంభించారు. మంగళవారం కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అధికారులు రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్లోని కార్పొరేట్ ఆఫీస్లో నగదు, హార్డ్డిస్క్లు, పలు బ్యాంకులకు చెందిన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఐదు రోజుల సెర్చ్ వారెంట్తో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి దండిగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీచైతన్య విద్యా సంస్థల లావాదేవీల సాఫ్ట్వేర్ను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. 2020లోనూ ఈ విద్యా సంస్థలపై ఐటీ సోదాలు జరిగాయి. శ్రీచైతన్య కాలేజీల ట్యాక్స్ చెల్లింపులపై అధికారులు ఆరాతీస్తున్నారు.
శ్రీచైతన్య కాలేజీల్లో ప్రతి ఏటా ఫీజుల పెంపుతో పాటు అధిక మొత్తంలో అనధికారిక లావాదేవీలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇందులో రెండు విధానాలను అవలంబిస్తున్నట్టు ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకునే క్రమంలో అధికశాతం ఫీజులను నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారని, అతి తక్కువ శాతం మాత్రమే ఆన్లైన్ పేమెంట్ విధానంలో వసూలు చేస్తున్నారని ఐటీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించినట్టు సమాచారం.