ఆ..పెన్నులతో పరీక్ష రాస్తే పాస్ గ్యారంటీ !

పదవ తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు పరీక్షలు పాస్ అవ్వటం కోసం పుస్తకాలతో కుస్తీ పడతారు. ఓ వైపు చదవడంతో పాటు రకరకాల ఆధ్యాత్మిక సెంటిమెంట్ లను ఫాలో అవుతూ ఉంటారు. తమ పిల్లలు పరీక్షలలో పాస్ అయ్యి మంచి మార్కులు వస్తే ముడుపులు చెల్లించుకుకుంటామని తల్లిదండ్రులు తమ ఇష్ట దైవానికి మొక్కుకుంటారు. ఇక పరీక్షల ప్రారంభం రోజు చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను దగ్గరుండి ఉదయాన్నే గుడికి తీసుకువెళ్ళి పెన్ను, హాల్ టికెట్ను దేవుడు వద్ద ఉంచి పూజలు చేశాకే పరీక్ష రాయటానికి తీసుకువెళతారు. ప్రతియేటా 10th క్లాస్ పరీక్షలు జరిగే సమయంలో.. పరీక్షలకు కొద్ది రోజుల ముందు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని విజయ గణపతి ఆలయంలో ఓ ఆనవాయితీ ఇప్పుడు అందరినీ ఆకట్టు కుంటుంది.

ఈ ఆలయ నిర్వాహకులు పరీక్షలు రాసేందుకు వెళ్లే10th క్లాస్ విద్యార్థులకి ప్రత్యేక పూజలు చేసిన పెన్నులను విద్యార్థులకు ఉచితంగా అందజేస్తారు. అయితే స్వామిద్దగర పూజ చేసిన పెన్ను కావాలనుకునే వారు పూజకు ముందు రోజే విద్యార్థి గోత్రనామాల వివరాలు అందివ్వాలి. అయితే విద్యార్థి గాని, తల్లిదండ్రులు గాని పూజల్లో ఉండాల్సిన పని లేదు. పూజ జరిగిన మరుసటి రోజు ఆలయానికి వచ్చి పేరు గోత్రం చెబితే చాలు పూజ చేసిన పెన్నుని విద్యార్థికి అందజేస్తారు. భగవంతుడి ఆరాధనలో సహస్ర నామార్చన గురించి వినే ఉంటారు. సహస్ర కలశాభిషేకం, సహస్ర దీప, పుష్పార్చనలు గురించి తెలిసే ఉంటుంది. కానీ ఏపీ మొత్తం మీద దేవుడికి సహస్ర కలములతో పూజ చేయటం శ్రీకాకుళంలోని విజయగణపతి ఆలయంలోనే ప్రత్యేకం.

ఈ ఏడాది 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నవేళ ఫాల్గుణ శుద్ధ సప్తమి పర్వదినం సందర్భంగా గురువారం స్వామివారి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం గణపతి హోమాన్ని నిర్వహించి స్వామివారికి ప్రత్యేకంగా సహస్ర కలములు తో ప్రత్యేకపూజలు చేసి విద్యార్థులకు ఆ పెన్నులను అందజేశారు. అలా పూజ చేసిన పెన్నుతో పరీక్షలు రాసిన విద్యార్థి తప్పక పరీక్ష పాస్ కావడమే కాదు, మంచి మార్కులు కూడా వస్తాయని విద్యార్థులు, పలువురు తల్లిదండ్రులు నమ్మకం. ఈ ఆనవాయితీని 2005 నుండి శ్రీకాకుళంలోని విజయ గణపతి ఆలయంలో నిర్వహిస్తూ వస్తున్నారు.

ఈ మహిమ గల పెన్నుల గురించి ఆ నోటా ఈ నోటా ప్రచారం జరిగి క్రమేపీ ఈ పెన్నులకు విద్యార్థుల నుండి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో పేరుకి సహస్ర కలముల పూజ ఆని చెబుతున్నా రెండు వేల నుoడి 3వేల పెన్నులకి పూజలు చేసి విద్యార్థులకు అందజేస్తున్నట్లు ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ఏడాది మార్చి నెల 17 నుండి పదవతరగతి పరీక్షలు ప్రారంభం అవుతోన్న నేపథ్యంలో ఈ మహిమ గల పెన్నులు అందుకున్న విద్యార్థులంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Leave a Reply