భధ్రాది రామయ్య కళ్యాణానికి కోటి: కేసీఆర్

భధ్రాది రామయ్య కళ్యాణానికి కోటి: కేసీఆర్

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం, పోడు భూముల పంపణీ, సొంత స్థలాల్లో ఇండ్ల నిర్మాణం కోసం పేదలకు ఆర్థిక సాయం, గొర్రెల పంపిణీ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో ఈ నెల 30న నిర్వహించనున్న రాములవారి కళ్యాణానికి సీఎం ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలను కేసీఆర్ మంజూరు చేశారు.

శ్రీరామనవమి సందర్భంగా సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. ఈనెల 30న భధ్రాచలంలో జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 1 కోటి రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.

అయితే కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా భధ్రాచలం దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు కళ్యాణ నిర్వహణకోసం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు.. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి, సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

వడగండ్ల వానలతో రైతులకు పంట నష్టం జరిగిన నేపథ్యంలోఇటీవల సీఎం పర్యటనలు చేపట్టి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు.

ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు పంట దెబ్బతిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ నిధులను జమ చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా వుందా అనే అంశానికి సంబంధించి సీఎస్ శాంతి కుమారితో ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం అన్ని అంశాలతో తాము సిద్ధంగా వున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.

అలాగే ఇప్పటికే ప్రకటించిన విధంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆ ప్రకారమే గొర్రెల కొనుగోలు పంపిణీ వ్యవహారాలు సాగాలని సీఎం స్పష్టం చేశారు. ఈమేరకు తక్షణ చర్యలు ప్రారంభించాలని సీఎస్ శాంతి కుమారికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఖాళీ స్థలాలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన రూ. 3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించి జారీ చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ శ్రీమతి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవిన్యూ శాఖ కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh