తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు

Telangana rains :తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణలో వాతవారణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.సాయంత్రానికి వాతావరణ చల్లబడి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.ఇదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీస్తాయని తెలిపింది. అయితే  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోసారి వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మంగళవారం ఉదయం నుంచి పలు ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయి. కాగా, ఇప్పటికే కురిసిన వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సంవత్సరం పొడవునా  శ్రమించిన రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చేతికందిన పంట అకాల వర్షంతో పూర్తిగా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమపై మరింత ఆర్థిక భారం పెరిగిపోయిందని వాపోయారు.

పంట నీటిపాలు కావడంతో భారీ నష్టమే జరిగిందని చెప్పారు. వాలిపోయిన పంటను తీసేందుకు యంత్రాలు, కూలీలకు రెట్టింపు ధరలు చెల్లించాల్సి రావడం తమకు తలకు మించిన భారమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గురువారం (ఈనెల 23న) సీఎం కేసీఆర్ ఖమ్మం, మహబుబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో అధికారులు రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. రైతులు అధైర్య పడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. కౌలు రైతులను కూడా తమ ప్రభుత్వమే ఆదుకుంటుందని చెప్పారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh